సిద్దరామయ్య రాజీనామాకు ఆమోదం.. మళ్లీ ఢిల్లీ చేరిన కీలక నేతలు!

  • ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరిన గవర్నర్‌ ‌
  • ఢిల్లీకి చేరిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌
  • తదుపరి చర్యలపై అధిష్ఠానంతో చర్చలు
  • జూన్‌ 1 లేదా 4న డీకే ప్రమాణస్వీకారం అంటూ ప్రచారం
  • రాజ్యసభ సీటుపై సిద్దరామయ్య సైలెన్స్‌
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్‌ ఆమోదించారు. దీంతో ప్రస్తుత మంత్రిమండలి కూడా తక్షణమే రద్దయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సిద్దరామయ్యను గవర్నర్‌ కోరారు.

ఢిల్లీకి సిద్దరామయ్య, డీకే
మరోవైపు కర్ణాటకలో నాయకత్వ మార్పు ప్రక్రియను పూర్తి చేసేందుకు అధిష్ఠానం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా సమావేశమై కొత్త ప్రభుత్వంపై చర్చిస్తున్నారు. మరోవైపు సిద్దరామయ్య ప్రయాణిస్తున్న విమానం ప్రతికూల వాతావరణం వల్ల మొదట జైపూర్‌కు మళ్లించారు. దీంతో కాస్త ఆలస్యంగా ఆయన కూడా ఢిల్లీ చేరుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీకి సిద్ధమయ్యారు.

కొత్త నాయకుడు
కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఢిల్లీ విమానాశ్రయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సిద్దరామయ్య క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. శాసనసభ పక్షం, పార్టీ హైకమాండ్ కలిసి కొత్త నాయకుణ్ని ప్రకటిస్తాయని స్పష్టం చేశారు. తనకు రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంపై మాత్రం ఆయన స్పందించలేదు. ఆ ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ నేరుగా ముందుకు సాగిపోయారు. డీకే శివకుమార్ కూడా అధిష్ఠానంతో చర్చల తర్వాతే తదుపరి నిర్ణయాలు ఉంటాయని మీడియాకు తెలిపారు.

డీకే ప్రమాణస్వీకారం?
మరోవైపు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. డీకే. శివకుమార్‌ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు దాదాపు మార్గం సుగమమైంది. మంత్రివర్గ కూర్పు, సిద్దరామయ్య డిమాండ్లపైనే అధిష్ఠానంతో ఆయన చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవి కొలిక్కి వస్తే ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. జూన్‌ 1 లేదా 4వ తేదీన ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందంటూ పార్టీల వర్గాల ద్వారా తెలుస్తోంది.

Siddaramaiah
Karnataka
DK Shivakumar
Congress
Chief Minister
Karnataka Politics
Rahul Gandhi
KC Venugopal
Government Formation

More Telugu News